11 డిసెంబర్, 2016

గీతాంజలిలో నాకిష్టమైన గేయం



"" సిక్కుల గురువు గోవిందుడు, ఓ కొండరాతి మీద కూర్చుని చదువుకుంటున్నాడు..

కిందగా యమున వడిగా ప్రవహిస్తోంది.. ఎత్తుగా నది మీదకి వొంగిన వొడ్డు , బొమలు ముడిచింది,, చుట్టూ మూగిన కొండలు,అడివి పెరిగి నల్లగా భయపెడుతున్నాయి.

ఐశ్వర్యమత్తుడు,ఆయన శిష్యుడు రఘునాధ్ వొచ్చి గురువుకి నమస్కరించి , " తమ అంగీకారానికి అర్హతలేని ఈ కానుకని తీసుకొచ్చాను " అని, వజ్రాలు చెక్కిన రెండు కంకణాల్ని గురువు కళ్ళముందు గొప్పగా మెరిపించాడు.. గురువు వాటిల్లో ఓ దాన్ని తీసుకుని తనవేలు చుట్టూ పరధ్యానంగా తిప్పుతూ చదువుకుంటున్నాడు.. రవ్వలు కాంతికిరణాల్ని అంతటా విరచిమ్మాయి..

కంకణం చప్పున వేలినించి జారి, వొడ్డునించి దొర్లి నీళ్ళలో పడ్డది.

ఒక్క అరుపు అరచి రఘునాధుడు నీళ్ళలో దూకాడు.. పుస్తకం మీదినించి తలయెత్తనేలేదు గురువు. తనకి దొరికిన భాగ్యాన్ని గట్టిగా దాచేసుకుని ఏమెరగనట్టు తన తోవన తాను ప్రవహిస్తోంది యమున.

అలిసి, నీళ్ళోడుకుంటో రఘునాధుడు తిరిగి వొచ్చేప్పటికి పగటికాంతి సన్నగిలుతోంది.. గట్టిగా వగరుస్తో అన్నాడు. " అదెక్కడ పడ్డదో తమరు చూపితే, దాన్ని ఇప్పుడైనా వెతికి తీసుకొస్తాను. "

ఆ రెండో కంకణాన్ని గురువు తీసుకుని " అక్కడ " అని నీళ్ళలోకి గిరాటేశాడు. ""

( రవీంద్రుని " గీతాంజలి " నుండి సేకరణ )

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి