10 అక్టోబర్, 2017

వేయిపడగలు పుస్తకం గురించి ఓ చిరు పరిచయం


విశ్వనాధ సత్యనారాయణ గారు రాసిన " వేయిపడగలు " అనే నవల చదువుతున్నాను ప్రస్తుతం నేను.. 

ఈ పుస్తకం పంతొమ్మిదీ ఇరవయ్యో శతాబ్దాల సంధి చరిత్ర అని చాలామంది అభిప్రాయం. ఆ సమయంలో నూతనంగా సమాజంలో కలుగుతూ ,, సామాన్య విషయాలవలే సంఘంలో జరుగుబాటవడానికి ఆస్కారమవుతున్న అనేకానేక విషయాల గురించీ,, ఆ ఆ మార్పులవల్ల కలిగే దుష్పరిణామాల గురించీ ఆనాడే హెచ్చరించిన గొప్ప వైజ్ఞానిక భవిష్యపురాణం ఇదని ఇంకొందరి అభిప్రాయం ...

ఆ రెండభిప్రాయాలూ చాలా నిజమని అనిపించేలా అనేకానేక వివరణాలూ, విశ్లేషణలూ ఉన్నాయి ఈ పుస్తకంలో,,

ఉదాహరణకు వివాహ వ్యవస్థ గురించి ఈ పుస్తకంలో కధానాయకుడైన ధర్మారావుతో రాధాపతి,, చక్రవర్తి అనే పాత్రలు చేసే ఈ వాదనలు చదవండి.. ఈ వాదన ద్వారా వివాహ వ్యవస్థ యొక్క గొప్పదనాన్ని వివరిస్తూనే శీలపోషణ,, మనో నియమము యొక్క ఆవశ్యకతనూ ,, స్వేఛ్ఛకీ - విశృంఖలత్వానికీ మధ్యగల తేడానూ ఎంత చక్కగా వివరించారో విశ్వనాధ వారు.

' వివాహమక్కర్లేకుండా సంఘంలో మనుష్యులు బ్రతకాలనీ , సెక్సే జీవిత పరమావధి అను ఉద్దేశముతో నైతిక విలువలకూ,, నాగరిక నియమాలకూ తిలోదకాలిచ్చినా పర్లేదను ' సిద్ధాంతాలతో ఉపన్యసిస్తూ,, ఫేస్బుక్లో పోస్ట్లు రాస్తూ తమని తాము మేధావి వర్గానికి చెందినవారిగా భావించుకొను కొందరు భ్రాంతిపరులకి ఈ మాటలు చెంపపెట్టులాంటివని నా అభిప్రాయం :)

ఆ వాదన ఇదిగో



"" రాధాపతి :- లోకములో స్త్రీ పురుషులందరునూ కామేచ్ఛ కలవారు .. ఎక్కడ చూచినను భర్తయు భార్యయు ఇతర స్థలములయందు సంచరించుచునే ఉన్నారు.. వివాహమన్నది ఆచారముగా చేసుకొనుచున్నారు గానీ,, ' ఇదిగో వీడు ఏకపత్నీవ్రతుడు, ఈమె పతివ్రత ' అని చూపించగల వారిని చెప్పుడు !

ధర్మారావు :- వీరి ప్రవర్తన బాగుగా ఉండలేదని మీరు చూపించుడు.

రాధా :- లక్షోపలక్షలు. మంచివారు నాకెచ్చటనూ కనుపించలేదు

ధర్మా :- మంచివారనగా ఏకపత్నీ వ్రతులు, పతివ్రతలు అనే కదా మీ యర్ధము. అట్టివారు మంచి వారైనప్పుడు అట్లుండట మంచిదనే కదా ! అట్లుందుట మంచి ,, ఇట్లుండుట చెడ్డ. ఇది మీరన్న మాటయే. వేరే వాదమక్కర్లేదు

చక్రవర్తి :- పండితులందరునూ చేయునది ఇదియే. మాటల అర్ధమును విరిచెదరు.. అది వాదన కాదు

ధర్మా :- అది వాదన అవునో కాదో తర్వాత. మీరు వాదించుడు ! లోకములో దాంపత్యము ఆదర్శప్రాయంగా లేదనుట వాదన కాదు. మనము కొన్ని మామిడిపండ్లు పుచ్చువైనచో చక్కని మామిడిపండే ఉండదని వాదించుట ఎట్లు? లోకమునందు ఏకపత్నీవ్రతులు ఉండరాదా?

రాధా :- లేదని నా ఉద్దేశ్యం 

ధర్మా :- ఆ మాట తప్పు. నేనున్నాను

రాధా :- మీకు పరస్త్రీ మీద బుద్ధియే ప్రసరించదా?

ధర్మా :- మీరు సరిగా మాట్లాడవలయును. ' మనసే ప్రసరించదా ' అని అనవలయును. మనస్సు వేరు - బుద్ధి వేరు. మనసు చంచలమైనది, బుద్ధి సిద్ధాంతరూపమైనది. పరస్త్రీ సంగమము దోషము కాదను బుద్ధి నాకు లేదు. మనస్సు ప్రసరింపవచ్చును . మనసు నిత్యము చంచలమైనది. దానిని ప్రయత్నముచే నియమించవలయును.

రాధా;- ఎందుకు నియమించవలయును? దాని ఇష్టం వచ్చినట్లు అది పోయినచో తప్పేమి?

ధర్మా :- మనము విద్య కావాలని చదువుకొనుచున్నాము. చదువుకుని కొంత నీతిగా ప్రవర్తించుచున్నాము. చదువుకొనకపోయిన నేమి? , నీతిగా ప్రవర్తించకపోయిన నేమి ? అనినచో సమాధానమేమియూ లేదు.

చదువుకోనివాడు జానపదుని వలె నాగరికులయందు చక్కగా ఎట్లు ప్రవర్తించలేడో, అట్లే అనియమితమైన మనస్సు మహావిషయములనందు అనాగరికమై ఉండును. ఆధ్యాత్మికమైన గౌరవము కలగదు..

నాగరికత అనగా నియమములకు ఒదిగియుండుట. మనము దగ్గర స్నేహితులతో ఉన్నప్పుడు యధేఛ్ఛగా మాట్లాదుదుము. సభలో ఉన్నప్పుడు ఒక నియమము అవలంబింతుము . దానిపేరే సభ్యత.

వాగ్నియమము ఎట్టిదో,, నలుగురిలో మర్యాదా ప్రవర్తనా ఎట్టిదో,, వానినుసరించి సభలో పురుషునకు యోగ్యత ఎట్లు కలుగునో,, అట్లే మనస్సునకు నియమావలంబనము చేత ఉత్తమ యోగ్యత కలుగును.

వాంఛ అణచని వానికి లఘుత , నియమించినవానికి గురుత. "" అని .

దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?

- Kks Kiran​

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి