08 ఏప్రిల్, 2017

అన్నమాచార్యుని కీర్తనకి భావార్ధ వివరణ

కీర్తనలైనా, కృతులైనా వింటున్నప్పుడు కేవలం ఆ శబ్ద సౌందర్యానికే ముగ్దులవక వాటి భావం,, ఆ పద ప్రయోగానికి అర్ధం తెలుసుకుంటూ వినడం అలవాటుగా చేసుకుంటే మన భాష తాలూకు సౌందర్యం,, మన వాగ్గేయకారుల గొప్పదనం అర్ధమవుతాయి...

ఉదాహరణకు అన్నమాచార్యుల కీర్తనలలో ఒకటైన " శరణు శరణు సురేంద్ర సన్నుత " అనే కీర్తనకు ఈ భావ వివరణ చూడండి,, ఎంత గొప్పగా ఉందో ....!!!!


"" ఓ వేంకటేశ్వర స్వామీ ! దేవేంద్రుని చేత పొగడ్తలందుకునేవాడా, లక్ష్మీదేవికి ఇష్టమైన వాడా ! రాక్షసుల గర్వాలను పోగొట్టినవాడా ! నిన్ను శరణు కోరుచున్నాను.

1. పద్మాన్ని ధరించిన బ్రహ్మ, పద్మాన్ని వికసింపజేసి దానికి మిత్రుడైన సూర్యుడు, పద్మాన్ని ముడుచుకుపోయినట్టు చేసిన చంద్రుడు, కుమారస్వామి (పుత్రుడు), క్రమంగా నీ సేవ చేయడానికి ఏకాగ్రతతో ఉన్నారు. వాళ్ళలాగే నిన్ను శరణు కోరుచున్న నన్ను రక్షించు.

2. రెప్పలు పడని కన్నులు గల దేవతా శ్రేష్ఠులు (అనిమిషేంద్రులు), మునులు, ఇంద్రుడు, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అనే ఎనిమిది మంది దిక్పాలకులు, దేవతలు, గుర్రపు ముఖం కలిగి, మనుష్య ఆకారం కలిగిన కిన్నరులు, అణిమ మొదలైన ఎనిమిది రకాల సిద్ధులు కలిగిన సిద్ధ పురుషులు, రంభ మొదలైన అందమైన అప్సరసలు, నీ సేవ చేయడానికి ఏకాగ్రత తో కాచుకుని ఉన్నారు.

3. పొగిడే (ఎన్నగల) ప్రహ్లాదుడు మొదలైన భక్తాగ్రేసరులు నిన్ను కొలవడానికి వచ్చారు. వెంకటాద్రి పర్వతం మీద ఉన్న వేంకటేశ్వరుడా ! మా అందరి మనవి (విన్నపము) వినవయ్యా ! విని రక్షించవయ్యా ! "" 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శుభోదయం 😊

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి